
రంగారెడ్డి, T6 న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య
కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాల
వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా
పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పని
చేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని
కలెక్టర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు
జరుగుతోన్న అన్యాయాలపట్ల, అసమానతలపట్ల తీవ్రంగా పోరాటం చేశారని,
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి ఉద్యమానికి ఊపిరి పోశారని
కలెక్టర్ కొనియాడారు. స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం
చేశాడన్నారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారని,
వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని నూరిపోశారని
అయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఈ సందర్బంగా కలెక్టర్
పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం
రూపొందించారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని
కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్
కుమార్, బి.సి.వెల్ఫేర్ అధికారి కేషురాం, వెనుకబడిన సంఘాల నాయకులు
మల్లేష్ యాదవ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

