
హైదరాబాద్,T6 న్యూస్: ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని.. విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
తన శాఖలో బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని…. ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానని చెప్పుకొచ్చారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని ఉద్ఘాటించారు. కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రాలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఉన్నా తమ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. బనకచర్ల, ఆల్మట్టిపై తాము నిబంధనల ప్రకారం ఫైట్ చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాల కోసం తమ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే తాము మహారాష్ట్ర వెళ్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కేసీఆర్ పదేళ్లలో చేసింది ఏమీలేదని ఆక్షేపించారు. కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా… భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంటలు పండాయని నొక్కిచెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.25 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

